
తృటిలో తప్పిన పెను ప్రమాదం
లారీని ఢీకొట్టిన స్కూల్ బస్సు…విద్యార్థులకు గాయాలు
పాలకుర్తి/మహబూబాబాద్(ck న్యూస్)ప్రతినిధి పల్లె దేవేందర్ గౌడ్ : మహబూబాబాద్ జిల్లా కురవి–ఖమ్మం ప్రధాన రహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. కురవి మండల పరిధిలోని మొదలగూడెం మూల సమీపంలో నాగార్జున విద్యాలయానికి చెందిన స్కూల్ బస్సు అతివేగంగా ప్రయాణిస్తూ ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో విద్యార్థులు ఉండగా, ఢీకొట్టిన ప్రభావంతో పలువురు విద్యార్థులకు గాయాలైనట్లు సమాచారం. స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. వెంటనే ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.




