
బూత్ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి
పాలకుర్తి,సి కే న్యూస్ : బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ఓటరు జాబితా సవరణలను పారదర్శకంగా, సకాలంలో పూర్తి చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి బీఎల్ఏలకు సూచించారు. పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం తొర్రూరు మండల, పట్టణ బూత్ లెవల్ ఏజెంట్లతో (బీఎల్ఏలు) నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ…ప్రతి బూత్లో పార్టీ కార్యకలాపాలను చురుగ్గా నిర్వహిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. కొత్తగా అర్హత పొందిన ఓటర్ల పేర్ల నమోదుతో పాటు ఓటరు జాబితాలోని తప్పులను సరిదిద్దడం, మార్పులు, చేర్పులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, వారి సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. పార్టీకి బీఎల్ఏలు వెన్నెముకలుగా పనిచేస్తూ ప్రతి బూత్లో సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్, మండల అధ్యక్షుడు రవీంద్ర చారి, పట్టణ అధ్యక్షుడు ముద్దసాని సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల, పట్టణ ఇన్చార్జులు, బీఎల్ఏలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




