
కొత్తూరు ప్రజలకు ఫ్లైఓవర్తో అన్యాయమా..?
వై జంక్షన్ నుండి –పెంజర్ల రోడ్డు వరకు నిర్మిస్తేనే ప్రయోజనం..
“ప్రజలకు ఉపయోగం లేని ఫ్లైఓవర్ ఎందుకు..?”
బైపాస్ జేపీ దర్గా వినాయక స్టీల్ వద్ద నిర్మాణంపై ప్రజలు, వ్యాపారుల ఆందోళన
“ఫ్లైఓవర్ దారి తప్పిందా..? కొత్తూరు ప్రజల ప్రశ్న”
షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు సీకే న్యూస్ , సెప్టెంబర్ 14
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరులో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ ప్రజలకు ఎంతమేర ప్రయోజనం చేకూరుస్తుందనే అంశంపై స్థానికుల్లో చర్చ మొదలైంది. కొత్తూరు వై జంక్షన్ నుంచి పెంజర్ల రోడ్డు వరకు ఫ్లైఓవర్ నిర్మిస్తే పట్టణ ప్రజలు, వ్యాపారులు, స్థానిక పరిశ్రమలకు మరింత ప్రయోజనం కలుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం బైపాస్ రోడ్డులో జేపీ దర్గా వినాయక స్టీల్ సమీపంలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ వల్ల స్థానిక ప్రజలకు పెద్దగా ప్రయోజనం ఉండదని, కొన్ని పరిశ్రమలకే ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. వినాయక స్టీల్, నాట్కో ఫార్మా వంటి పరిశ్రమలకు ఈ నిర్మాణం ప్రయోజనం చేకూర్చేలా ఉందని వారు పేర్కొంటున్నారు.
కొత్తూరు వై జంక్షన్ నుంచి పెంజర్ల రోడ్డు వరకు ఫ్లైఓవర్ నిర్మిస్తే పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు ప్రజలు, వ్యాపారులు, పరిశ్రమలకు సమానంగా ప్రయోజనం కలుగుతుందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులు మరోసారి సమగ్రంగా ఆలోచించాలని కోరుతున్నారు.
అండర్పాస్ లేదా ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల భవిష్యత్లో కొత్తూరు పట్టణానికి కలిగే ప్రయోజనాలు, నష్టాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేకంగా దృష్టి సారించి స్థానికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.
కొత్తూరు అభివృద్ధికి ఉపయోగపడేలా, ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరే విధంగా ఫ్లైఓవర్ నిర్మాణం ఉండాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.




