
ఏన్కూరు బ్రిడ్జిపై వరద నీరు..
వరద నీటిలోనే వాహనాల రాకపోకలు
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఆగస్టు 07 2026: ఖమ్మం–భద్రాచలం ప్రధాన రహదారిపై ఏన్కూరు మండల కేంద్రంలోని ఎన్ఎస్పీ కాలువ బ్రిడ్జిపై వరద నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా బ్రిడ్జిపై నీరు చేరడంతో రహదారి స్పష్టంగా కనిపించక ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి.
ఈ మార్గంలో ప్రతి రోజు వందలాది ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, లారీలు, ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. బ్రిడ్జిపై నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు భయాందోళనల మధ్య ప్రయాణం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
అదేవిధంగా, పెద్ద వాహనాలు అధిక వేగంతో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న సమయంలో వరద నీరు, బురద ద్విచక్ర వాహనదారులు, పాదచారులపై చిమ్ముతుండటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బురద నీరు కళ్లపై పడటంతో వాహనాలపై నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశముందని ప్రజలు చెబుతున్నారు. పంచాయతీ అధికారులు, ఆర్&బీ శాఖ అధికారులు, సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి బ్రిడ్జిపై నిల్వ ఉన్న నీటి సమస్యను పరిష్కరించి, ప్రమాదాలు జరగకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.




