
మందుబాబుల గుండెల్లో రైలు పరిగెత్తించిన మహిళ ఎస్సై
ఏన్కూర్: ప్రభుత్వ ఉద్యోగం చేపట్టిన తర్వాత బాధ్యతతో పనిచేయడం అంటే కొంతమందికి నచ్చే పరిస్థితి ఉండదు. శాంతిభద్రతలను కాపాడటంలో, లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయడంలో తనదైన శైలిలో ఏన్కూర్ ఎస్సై సంధ్య చేస్తున్న విధులను పలువురు అభినందిస్తున్నారు.
అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ప్రమాదాల నివారణ కార్యక్రమంలో భాగంగా మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే వాహనదారులు ఇబ్బంది పడతారని కొన్ని సందర్భాల్లో చెప్పినప్పటికీ, అదే రీతిని కొనసాగించడంతో రంగంలోకి దిగిన ఎస్సై సంధ్య రాత్రి సమయాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ వాహనదారుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నారు.
సహజంగా పురుష ఎస్సైలు బాధ్యతలు నిర్వహించే వ్యక్తులు రాత్రి సమయాల్లో చెకింగ్ చేయడంలో అంతగా ఆసక్తి కనబరచకపోయినా, మహిళా ఎస్సైగా సంధ్య రాత్రి సమయంలో వాహనాల తనిఖీలతో పాటు మండలంలో ఇటీవల కాలంలో జరిగిన చోరీ కేసులను రికవరీ చేయడంలో ముందున్నారు.
ఉన్నతాధికారులు సైతం ఎస్సై సంధ్య సేవలను గుర్తించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పని చేయాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగానే ప్రమాదాల నివారణ కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు ఎస్సై సంధ్య తెలిపారు.




