
25 అడుగుల బావిలో పడిన వృద్ధురాలు..
కాకరకాయలు కోయడానికి వెళ్లి బావిలో పడ్డ వృద్ధురాలు
బావిలో పడి కేకలు.. విద్యార్థి గుర్తించి గ్రామస్థులకు సమాచారం
సీకే న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు ఆగస్టు 30 2026: కాకరకాయలు కోయడానికి వెళ్లిన ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు సుమారు 25 అడుగుల లోతున్న ఇరుకుబావిలో పడిపోయిన ఘటన ఏన్కూరు మండలంలోని సూర్య తండ గ్రామపంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆమెకు ప్రాణాపాయం తప్పడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు.
స్థానికుల వివరాల ప్రకారం..మర్సుకుంట గ్రామానికి చెందిన మోత్కూరి రాజమ్మ (సుమారు 60 సంవత్సరాలు) కాకరకాయలు కోయడానికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న ఇరుకుబావిలో జారిపడ్డారు. సుమారు 25 అడుగుల లోతు ఉన్న బావిలో పడిపోయిన రాజమ్మ భయంతో కేకలు వేయడంతో సమీపంలోని ఇంట్లో చదువుకుంటున్న ఓ విద్యార్థి ఆ శబ్దాలను గమనించాడు.
వెంటనే బయటకు వచ్చి బావి వద్దకు వెళ్లి చూడగా రాజమ్మ బావిలో పడిపోయి ఉండటాన్ని గుర్తించాడు. విషయాన్ని వెంటనే గ్రామస్థులకు తెలియజేయడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. స్థానికులు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టి నిచ్చెన తదితర సాయంతో ఆమెను బావి నుంచి సురక్షితంగా బయటకు తీశారు.
ఈ ప్రమాదంలో రాజమ్మకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. సకాలంలో విద్యార్థి స్పందించి గ్రామస్థులకు సమాచారం అందించడంతో ఆమెను వెంటనే బయటకు తీయగలిగారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.




