ఆఫీసు ను గాలికి వదిలేసిన అధికారులు ఫాంక్షన్ లో చిందులు

జిల్లా వెల్ఫేర్ ​ఆఫీసర్ ​గృహ ప్రవేశానికి తరలివెళ్లిన ఉద్యోగులు;

By :  Admin
Update: 2025-02-08 04:24 GMT


ఆఫీసు ను గాలికి వదిలేసిన అధికారులు ఫాంక్షన్ లో చిందులు

జిల్లా వెల్ఫేర్ ​ఆఫీసర్ ​గృహ ప్రవేశానికి తరలివెళ్లిన ఉద్యోగులు

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆఫీస్​ ఖాళీ

ఆయన ఓ జిల్లా శాఖకు ఇన్​చార్జి.

ఈ మధ్యే సొంతిల్లు కట్టుకున్నాడు. శుక్రవారం మంచిరోజని గృహప్రవేశం పెట్టుకున్నాడు. దీని కోసం లీవ్​పెట్టాడు. తన కింద పని చేసే ఉద్యోగులు, ఇతర సిబ్బందిని ఆ కార్యక్రమానికి ఆహ్వానించాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తన కింద పనిచే వారందరినీ ఫంక్షన్​కు పట్టుకుపోవడంతో కార్యాలయమంతా ఖాళీ అయ్యింది.

ఇది జరిగింది ఎక్కడో శివారులో కాదు.. సాక్షాత్తు నగరం నడిబొడ్డున ఉన్న లక్డీకాపూల్​లోని హైదరాబాద్​కలెక్టరేట్​లో... ఈ ప్రాంగణంలోని ఓ బ్లాక్​లో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆఫీసు ఉంది. డీసీపీఓ, ప్రొటెక్షన్​ ఆఫీసర్, సూపర్​వైజర్లు, ఫీల్డ్, రెస్క్యూ ​ఆఫీసర్లు, అకౌంటెట్లు ఇతర ఉద్యోగులు, సిబ్బంది కలిపి 50 మంది వరకు ఇక్కడ పని చేస్తుంటారు. వీరిని కలవడానికి జిల్లా వ్యాప్తంగా రోజూ వందలాది మంది మహిళలు, పిల్లలు, తల్లిదండ్రులు, వృద్ధులు వచ్చి పోతుంటారు. అలాగే 1,098కు వచ్చే కాల్స్​రిసీవ్​చేసుకుని పిల్లలను రెస్క్యూ చేయాల్సి ఉంటుంది.

కానీ, శుక్రవారం జిల్లా వెల్ఫేర్​ఆఫీసర్​అక్కేశ్వర్​రావు ఇంట్లో గృహ ప్రవేశం ఉండడంతో అందరూ అక్కడికే వెళ్లారు. 50 మందిలో కేవలం ఒక అకౌంటెంట్, మరో సిబ్బంది మాత్రమే ఆఫీసుకు వచ్చారు. ఉదయమే అంతా ఆఫీసుకు వచ్చినా రిజిస్టర్​లో సంతకాలు పెట్టి, 10 గంటల కల్లా బయటపడ్డారు. ఆఫీస్​తలుపులు ఖుల్లా ఉన్నా లోపల ఒక్కరూ లేక వివిధ అవసరాలతో వచ్చిన వాళ్లంతా గంటలపాటు వేచి చూసి నిరాశతో వెనుదిరిగారు.

'మా కూతురును స్కూల్​కు పంపడం లేదని ఇక్కడి ఆఫీసర్లు తీసుకువచ్చిన్రు. ఎక్కడుందని అడిగితే హోంలో పెట్టామని, శుక్రవారం వస్తే చెప్తామని అన్నరు.. ఈ రోజు వస్తే ఎవరూ లేరు.. నేను ఎవరిని అడగాలి' అని భార్యభర్తలు వాపోయారు. సాయంత్రం వరకూ వెయిట్​చేసి వెళ్లిపోయారు. అలాగే అడాప్షన్ వివరాలు తెలుసుకునేందుకు మరొకరు అక్కడే వేచి చూడడం కనిపించింది.

ఇలా ఉదయం నుంచి సాయంత్రం 5 వరకు దాదాపు100 మంది వరకు వేచి చూసినా ఎవరూ రాలేదు. మధ్యాహ్నం మూడున్నరకు ఒకరు బాలరక్ష భవన్​కు తాళం వేసుకుని వెళ్లిపోయారు. జనాలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన ఆఫీసర్ ఉన్న ఉద్యోగులను తన ఫంక్షన్​కు పట్టుకుపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఆఫీస్​వద్దకే ప్రత్యేకంగా బస్సులు పంపించినట్లు సమాచారం.

Similar News