ప్రియుడి వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్య
ప్రియుడి వేధింపులు భరించలేక ఓ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వారాసిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.;
ప్రియుడి వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్య
ప్రియుడి వేధింపులు భరించలేక ఓ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వారాసిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
ఇన్స్పెక్టర్ సైదులు, అడ్మిన్ ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మేస్ర్తీ పనిచేసే మచా నాగయ్య తన కుమారుడు, కుమార్తెతో బౌద్ధనగర్ పరిధిలో ఉంటున్నాడు. నాగయ్య కుమార్తె మచా ప్రవళ్లిక(23) కోఠి ఉమెన్స్ కాలేజీలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. సాయంత్రం వేళలో వారాసిగూడలో ఓ ఆస్పత్రిలో పార్ట్టైమ్ జాబ్ చేస్తోంది.
ప్రవళ్లిక, సుజన్ అనే యువకుడు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గత కొన్నిరోజుల నుంచి సృజన్ ప్రవళ్లికను అనుమానిస్తూ, వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. ఈనెల ఆరవతేదీ గురువారం సాయంత్రం ఓయూలో వారిరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మరో స్నేహితుడు మధుకర్ను పిలిపించగా ఇద్దరినీ సముదాయించాడు. అదేరోజు రాత్రి నాగయ్య తాను ఫంక్షన్కు వెళ్తున్నానని, ఆలస్యంగా వస్తానని ప్రవళ్లికకు ఫోన్ ద్వారా తెలిపాడు.
కుమారుడు ఉద్యోగానికి వెళ్లటంతో ఇంట్లో ప్రవళ్లిక ఒక్కతే ఉంది. ఫంక్షన్ నుంచి అర్ధరాత్రి ఇంటికి వచ్చిన నాగయ్యకు ప్రవళ్లిక ఉరేసుకుని కనిపించింది. స్థానికుల సహాయంతో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రవళ్లిక స్నేహితుడు మధుకర్.. నాగయ్యతో అతని కుమార్తె ప్రేమ విషయం, ప్రియుడితో ఉన్న గొడవలను తెలిపాడు. నాగయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు సృజన్పై కేసును నమోదు చేశారు.