
కూల్డ్రింక్ చిచ్చు.. ప్రాణభయంతో ఐదుగురు విద్యార్థులు పరార్!
Web desc : మహబూబాబాద్ జిల్లాలో విచారణమైన ఘటన చోటుచేసుకుంది. మరిపెడ మండల కేంద్రంలోని గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాల , కళాశాలలో ర్యాగింగ్ తీవ్ర కలకలం సృష్టించింది. కేవలం ఒక కూల్డ్రింక్ (థమ్సప్) విషయంలో తలెత్తిన చిన్నపాటి వివాదం విద్యార్థుల మధ్య ఘర్షణకు దారితీసి చివరకు అది భౌతిక దాడి వరకు వెళ్లడం విచారకరం.
పాఠశాలలో చదువుతున్న 9వ తరగతికి చెందిన ఐదుగురు విద్యార్థులపై, అదే క్యాంపస్లో ఉంటున్న ఇంటర్ సెకండియర్ విద్యార్థులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడికి ప్రధాన కారణం ఒక కూల్డ్రింక్ సీసా విషయంలో జరిగిన గొడవ అని తెలుస్తోంది.
పెద్ద విద్యార్థులు తమపై దాడి చేయడంతో భయాందోళనకు గురైన సదరు ఐదుగురు విద్యార్థులు, ఈ నెల 1వ తేదీన ఎవరికీ చెప్పకుండా గురుకులం నుండి పరారయ్యారు.
తమ పిల్లలు కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు గురుకులానికి చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. సీనియర్ విద్యార్థుల వేధింపులు, ర్యాగింగ్ కారణంగానే తమ పిల్లలు ప్రాణభయంతో బయటకు వెళ్లాల్సి వచ్చిందని వారు ఆరోపిస్తున్నారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురుకులం ముందు వారు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై బాధితుల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.
విద్యాసంస్థల్లో భద్రత , క్రమశిక్షణపై ఈ ఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. విద్యార్థుల మధ్య ఉండాల్సిన స్నేహపూర్వక వాతావరణం దెబ్బతినడంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.




