
జ్యూస్ తాగుతూ గుండెపోటుతో యువకుడు మృతి
ఓ యువకుడు జ్యూస్ తాగుతూ గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా పల్లెపాడుకు చెందిన ఏకలవ్య (30) బుధవారం రాత్రి పాన్షాప్ ముందు జ్యూస్ తాగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తాజాగా.. హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నంలోనూ విషాదకర ఘటన చోటు చేసుకుంది.
జ్యూస్ తాగడానికి వచ్చిన యువకుడు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. చూస్తుండగానే క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. యువకుడి అకాల మరణం స్థానికులను, అతని కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాలోని పల్లిపాడుకు చెందిన ఏకలవ్య అనే యువకుడు ఇబ్రహీంపట్నం కేంద్రంలోని ఓ జ్యూస్ షాప్ వద్ద జ్యూస్ తాగేందుకు వెళ్లాడు. ఆర్డర్ ఇచ్చిన జ్యూస్ తాగుతుండగా.. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది.
దాంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. యువకుడి పరిస్థితి గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. సీపీఆర్ చేసి అతడి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో పోలీసులకు సమాచారం అందించారు.
అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో.. పోలీసులు హుటాహుటిన తమ వాహనంలోనే ఏకలవ్యను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు, అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
30 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మరణించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు ఏకలవ్య మృతి విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ మధ్య కాలంలో యువతలో గుండెపోటు మరణాలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.
జీవనశైలిలో మార్పులు, తగిన శారీరక శ్రమ లేకపోవటం, అధిక ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు వంటివి ఆకస్మిక గుండెపోట్లకు కారణాలుగా వైద్య నిపుణులు చెబుతున్నారు. యువత తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
రోజులో కనీసం అర గంటైనా వ్యాయామానికి కేటాయించాలని చెబుతున్నారు. జంక్ ఫుడ్స్కు దూరంగా ఉండటంతో పాటు పోషక విలువలు ఉన్న ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇవ్వాలని యువతకు వైద్య నిపుణులు సూచిస్తున్నారు.