
కొత్తూరులో అగ్నిప్రమాదం: రూ. 5 లక్షల నష్టం
గడ్డివాము నుంచి వ్యాపించిన మంటలు కొత్తూరు ప్లంబర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం
షాద్నగర్ నియోజకవర్గం నేటి శుభోదయ ప్రతినిధి జులై 15
కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు చెలరేగిన ఈ మంటల్లో ఒక ప్లంబింగ్ గోదాం పూర్తిగా కాలిబూడిదైంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని బాబూలాల్ గోదాం వద్ద ఉన్న గడ్డివాముకు ఒక్కసారిగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. గడ్డి ఎండిపోయి ఉండటంతో నిమిషాల వ్యవధిలోనే మంటలు తీవ్రరూపం దాల్చాయి. ఆ గడ్డివాము పక్కనే ఉన్న ఓం ప్రకాష్ అనే వ్యక్తికి చెందిన ప్లంబర్ గోదాంకు ఈ మంటలు వేగంగా వ్యాపించాయి. గోదాంలో ప్లాస్టిక్ పైపులు, ఇతర సామాగ్రి భారీగా ఉండటంతో మంటలు ఆకాశాన్నంటాయి. చుట్టుపక్కల దట్టమైన నల్లటి పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది, స్థానికులతో కలిసి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. వెంటనే స్పందించడంతో చుట్టుపక్కల మంటలు వ్యాపించకుండా పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ ప్రమాదంలో ప్లంబర్ గోదాంలో ఉన్న విలువైన సామాగ్రి అంతా కాలి బూడిదైందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు ఐదు లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



