
పంట అవశేషాలు కాల్చొద్దు.. భూమి సారాన్ని కాపాడండి
రైతులకు అవగాహన కల్పించిన వైరా కేవీకే శాస్త్రవేత్తలు
CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు మే 14 2026: ఏన్కూరు మండలంలోని తూతకలింగన్నపేట రైతు వేదికలో రైతులకు పంట అవశేషాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమంలో భాగంగా వైరా కేవీకే విస్తరణ శాస్త్రవేత్త ఫణి స్త్రీ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ అధికారులు రైతులకు పంట కోత అనంతరం మిగిలే అవశేషాలను కాల్చకుండా భూమిలోనే దున్నుకోవాలని సూచించారు.
పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల భూమి సారవంతత తగ్గిపోవడంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని వివరించారు. అలాగే గాలిలో కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. పంట అవశేషాలను భూమిలో కలపడం ద్వారా నేలలో సేంద్రియ పదార్థాలు పెరిగి భూమి ఆరోగ్యం మెరుగుపడుతుందని, తద్వారా పంట దిగుబడులు కూడా అధికంగా వచ్చే అవకాశముంటుందని పేర్కొన్నారు.
ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులు అనుసరించాలని, ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ యంత్రాలను వినియోగించుకుని పంట అవశేషాలను సేంద్రియ ఎరువులుగా మలచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తూతకలింగన్నపేట సర్పంచ్ గూగులోతు ప్రవీణ్, ఉప సర్పంచ్ నామ వెంకయ్య, ఏఈఓ భవ్యతో పాటు పలువురు రైతులు పాల్గొని శాస్త్రవేత్తలు తెలిపిన సూచనలను ఆసక్తిగా వినిపించారు.




