
ఆర్టీసీలో 1500 కండక్టర్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..
Web desc : తెలంగాణలోని నిరుద్యోగులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 1500 కండక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) యాజమాన్యమే ఈ పోస్టుల భర్తీని చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ పోస్టులకు ఉద్యోగులను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా.. ఉద్యోగాల భర్తీకి సంబంధించి రెండుమూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది.
సాధారణంగా ఆర్టీసీలో పోస్టులు భర్తీ ప్రక్రియను పోలీస్ రిక్రూట్మెంట్కు అప్పగించడం ఆనవాయితీ. తాజాగా కండక్టర్ పోస్టుల భర్తీని మాత్రం ఆర్టీసీ యాజమాన్యానికే అప్పగించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై శుక్రవారం స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం టీజీఎస్ఆర్టీసీ ఆవిర్భవించిన తరువాత ఇప్పటి వరకు కండక్టర్ పోస్టులను భర్తీ చేయలేదు. ప్రతీయేటా ఉన్న ఉద్యోగులే రిటైరవుతుండటంతో ఖాళీలు పెరుగుతూ వస్తున్నాయి. కొంతకాలం క్రితం ఔట్ సోర్సింగ్ పద్దతిలో తాత్కాలికంగా హైదరాబాద్, సికింద్రాబాద్ సహా వివిధ రీజియన్ల పరిధిలోని డిపోల్లో నియమించింది.
అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంతో 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి ఆర్టీసీ సమాయత్తం అవుతోంది. కండక్టర్ పోస్టులకు పదో తరగతిలో వచ్చిన మార్కుల శాతాన్ని ఆధారంగా తీసుకుని ఎంపిక చేసే విధానం ఆర్టీసీలో ఉంది. ప్రస్తుతం అదే ప్రక్రియతో పోస్టుల భర్తీకి ఆర్టీసీ యాజమాన్యం సిద్ధమవుతోంది. అయితే, ఇక్కడే కొత్త సమస్య ఎదువుతోంది.
కండక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్లో కొందరు మార్కుల శాతంతో, మరికొందరు గ్రేడ్ పాయింట్లతో దరఖాస్తు చేసే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఈ రెండు విధానాలను ఎలా పరిగణలోకి తీసుకోవాలన్న అంశంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం ఎస్ఎస్సీ బోర్డుకు లేఖ రాసింది. గ్రేడింగ్ ను మార్కుల శాతంగా ఎలా లెక్కించాలి అనే విషయంపై బోర్డు నుంచి స్పష్టత తీసుకొని కండక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆర్టీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.




