
లంచం తీసుకుంటూ బుక్కైన ఈఈ, ఏఈ…
రాష్ట్రంలో ఏసీబీ (ACB) అదికారులు అవినీతి అధికారల ఆట కట్టిస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
వివరాల్లోకి వెళితే.. జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు కోసం నీటిపారుదల శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (NOC) కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఈ ఎన్వోసీ ఇవ్వడానికి నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (EE) రాథోడ్ విఠల్, అసిస్టెంట్ ఇంజినీర్ (AE) రమేశ్లు బాధితుడిని రూ.లక్ష లంచం డిమాండ్ చేశారు.
అంత పెద్ద మొత్తం ఇచ్చుకోలేనని బాధితుడు బతిమిలాడటంతో చివరకు రూ.60 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది.ఇక లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఈ విషయమై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో దాడి చేశారు.
ఆదిలాబాద్లోని నీటిపారుదల శాఖ కార్యాలయంలోనే బాధితుడి నుంచి ఈఈ విఠల్, ఏఈ రమేశ్ రూ.60 వేల నగదు తీసుకుంటుండగా అధికారులు మెరుపుదాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రికార్డులను పరిశీలిస్తున్నారు.




