
నేడే తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఆ నిర్ణయాలపైనే అందరి కళ్లు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. రాష్ట్ర పురోగతికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులు, తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు, నూతన చట్ట సవరణల అజెండాతో సాగనున్న ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధానంగా నీటిపారుదల ప్రాజెక్టుల సవరించిన అంచనా విలువలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు.
ప్రాజెక్టుల అంచనాలు, మెట్రో రైలుపై సమీక్ష : గత కేబినెట్ హామీ మేరకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీలతో పాటు నిర్మాణంలో ఉన్న ఇతర ప్రాజెక్టుల పురోగతిని కేబినెట్ సమీక్షించనుంది.
అలాగే మెట్రో రైలు రెండో దశ విస్తరణ, ఎల్ అండ్ టీ నుంచి టేకోవర్ ప్రక్రియలో కేంద్రం వైఖరి, కమిటీ ఏర్పాటులో ఆలస్యంపై ప్రభుత్వం చర్చించనుంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి సరఫరా, వ్యవసాయ కంటింజెన్సీ ప్లాన్ అమలు, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణపై కూడా నిర్ణయాలు తీసుకోనున్నారు.
పీఆర్ చట్ట సవరణ.. రిసోర్స్ మొబిలైజేషన్ భేటీ : గ్రామ పంచాయతీల ఆర్థిక స్వయం ప్రతిపత్తిని బలోపేతం చేసేందుకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 70(3) సవరణకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
మరోవైపు, కేబినెట్ భేటీ కంటే ముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ‘రిసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ’ సమావేశమై భూముల అమ్మకాల ద్వారా నెలకు రూ.1000 కోట్ల ఆదాయం సమకూర్చే ప్రణాళికలపై చర్చించనుంది. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు పాల్గొననున్నారు.




