
20లక్షల డిమాండ్… యువకుడి బలవన్మరణమా..?
web desc : ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలో ఓ యువకుడు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ముదిగొండ గ్రామానికి చెందిన మెట్టెల వినయ్ (యువకుడు) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు.
గ్రామస్తుల వివరాల ప్రకారం.. శుక్రవారం వినయ్ తల్లిదండ్రులు ఖమ్మంలోని డిమార్ట్కు వెళ్లారు. సాయంత్రం సుమారు 7:30 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో వినయ్ ఉరి వేసుకున్నాడు. అదే సమయంలో లక్ష్మణ్ అనే యువకుడు గమనించి స్థానికులకు సమాచారం అందించాడు. స్థానికులు వినయ్ ఇంటికి చేరుకునే సరికి అతడు మృతి చెంది ఉన్నాడు. తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు.
కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. సోషల్ మీడియాలో సూసైడ్ లెటర్లు వైరల్.. వినయ్ మృతికి కొందరు వ్యక్తులే కారణమంటూ పేర్కొన్నట్లు ఉన్న కొన్ని సూసైడ్ లెటర్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ లేఖలలో పేర్కొన్న వ్యక్తులకు, వినయ్కు మధ్య ఉన్న సంబంధంపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.
పోక్సో కేసే కారణమా..? గతంలో వినయ్పై పోక్సో కేసు నమోదై జైలుకు వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆ కేసులో తనకు శిక్ష పడుతుందనే భయంతోనే వినయ్ బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని గ్రామంలో చర్చ జరుగుతోంది. మైనర్ బాలిక తరఫున పెద్దమనిషిగా వ్యవహరించిన వ్యక్తి కారణంగానే తనపై కేసు నమోదైందని వినయ్ భావించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.
అయితే ఈ విషయాలపై పోలీసుల విచారణలో పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. మరోవైపు.. తమ కుమారుడిని కొందరు వ్యక్తులు రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురిచేశారని వినయ్ తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు అనుమానం ఉన్న వ్యక్తులపై ముదిగొండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వినయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూసైడ్ లెటర్లలోని అంశాలు, తల్లిదండ్రుల ఫిర్యాదు, గతంలో నమోదైన పోక్సో కేసు తదితర కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు వినయ్ బలవన్మరణానికి కారణాలేమిటన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.




