
మహీంద్రా కంపెనీ ముందు ధర్నాకు దిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని
Web desc : సాఫ్ట్ వేర్ జాబ్ అనగానే చాలామంది యువత ఎగిరి గంతస్తారు. లక్షల్లో జీతం.. వీకెండ్ లో ఎంజాయ్.. అంటూ తెగ సంబరపడిపోతుంటారు. కానీ సాఫ్ట్ వేర్ జాబ్ వెనుక ఉన్న అసలైన స్వరూపాన్ని ఓ మహిళా ఉద్యోగిని తాజాగా బయటపెట్టారు. వాష్ రూమ్ కు వెళ్లాలంటే పర్మిషన్..! లీవ్ అడిగితే ఉద్యోగం పోయింది.. అంటూ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ టెక్ మహీంద్రాపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
అంతేకాక మేడ్చల్ లోని టెక్ మహీంద్రా కంపెనీ ముందు ధర్నాకు దిగారు సాఫ్ట్వేర్ ఉద్యోగిని భావన. అకారణంగా తనను జాబ్ నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పాపకు ఆరోగ్యం బాగోలేదని 3 రోజులు సెలవు కావాలని కోరితే ఉద్యోగం నుంచి తీసేశారని భావన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరోగ్యం బాగాలేక కంపెనీలో పడిపోతే కనీసం పట్టించుకోలేదని.. 14 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ సమయంలో కూడా ఉద్యోగంలో నుంచి తీసేస్తామని బెదిరించారని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే తనను జాబ్ లో నుంచి తీసేశారని గురువారం దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఏం జరిగిందంటే..?
మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్ పల్లిలో ఉన్న టెక్ మహీంద్ర కంపెనీలో భావన అనే ఉద్యోగిని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. అయితే ఇటీవల తన పాపకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో కంపెనీ నిబంధనల ప్రకారమే మూడు రోజులు సెలవు కావాలంటూ యాజమాన్యానికి ముందస్తుగా సమాచారం అందించారు.
అయితే చిన్నారి ఆరోగ్యం బాగోలేదనే కనీస మానవతా కోణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా.. సెలవు మంజూరు చేయకపోగా తనపై ఉద్దేశపూర్వకంగా వేధింపులకు మేనేజ్ మెంట్ దిగిందని ఉద్యోగిని భావన ఆరోపించారు. ఆ తర్వాత ఆమెను విధుల్లోంచి తొలగిస్తున్నట్లు ఈ-మెయిల్ ద్వారా సమాచారం పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు.
రూల్స్ అంటూ ఉద్యోగులకు కనీస ప్రాథమిక హక్కులను కూడా కంపెనీ కాల రాస్తోందని మండిపడ్డారు. వర్కింగ్ అవర్స్ లో వాష్ రూమ్ కు వెళ్లాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అత్యంత దారుణమైన వాతావరణం అక్కడ నెలకుందని తెలిపారు. ఇక ఇప్పటికే తనకు జరిగిన అన్యాయంపై దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన భావన ఆ తర్వాత టెక్ మహీంద్రా ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు.
అకారణంగా తనను తొలగిస్తున్న నిర్ణయాన్ని యాజమాన్యం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తనకు పూర్తి న్యాయం జరిగే వరకు న్యాయపోరాటంతో పాటు నిరసనను కొనసాగిస్తానని భావన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈమె కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.




