
ఆలూరు ప్రభుత్వ పాఠశాలకు కొత్త గేటు ఏర్పాటు…
విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతకు సర్పంచ్ ఉల్లిగపల్లి నరసింహులు ప్రత్యేక చొరవ…
గట్టు సెప్టెంబర్ 2 :
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎన్నో సంవత్సరాలుగా నెలకొన్న గేటు, కాంపౌండ్ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. పాఠశాలకు సరైన గేటు లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని గుర్తించిన గ్రామ సర్పంచ్ ఉల్లిగపల్లి నరసింహులు ప్రత్యేక చొరవ తీసుకుని పాఠశాలకు నూతన గేటును ఏర్పాటు చేయించారు.
గత కొన్ని సంవత్సరాలుగా పాఠశాల చుట్టూ పూర్తి స్థాయి రక్షణ లేకపోవడంతో విద్యార్థుల భద్రత విషయంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆందోళన చెందేవారు.
పాఠశాల ప్రాంగణంలోకి పశువులు, ఇతరులు ప్రవేశించే అవకాశం ఉండటంతో విద్యార్థుల చదువుకు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడేవి. ఈ సమస్యను గ్రామ పాలకవర్గం దృష్టికి తీసుకురావడంతో సర్పంచ్ నరసింహులు స్పందించి గేటు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.
సర్పంచ్ ఆధ్వర్యంలో గేటు ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం పాఠశాల ప్రాంగణానికి రక్షణ ఏర్పడటంతో పాటు విద్యార్థులకు భద్రత మరింత పెరిగింది. పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో విద్యను అభ్యసించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు, గ్రామస్థులు తెలిపారు.
గ్రామంలో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమని గ్రామ ప్రజలు పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న పాఠశాల గేటు సమస్యకు పరిష్కారం చూపిన సర్పంచ్ ఉల్లిగపల్లి నరసింహులుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా.. గ్రామాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సర్పంచ్ నరసింహులు పాఠశాల అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.




