
బీజేపీలో విషాదం.. సీనియర్ నేత కన్నుమూత
బిజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయ్ కుమార్ మల్హోత్రా కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. ఈరోజు ప్రాణాలు కోల్పోయినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఢిల్లీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలిపారు. మల్హోత్రా జీవితం మొత్తం.. దేశానికి, ప్రజలకు అంకితం అయినదని అన్నారు. అది ఆయన నిరాడంబరతకు, ప్రజా సేవకు నిదర్శనమని కూడా సచ్దేవా తెలిపారు.
జనసంఘ్ రోజుల నుంచి ఆయన ఢిల్లీలో పార్టీ సిద్ధాంతాలను విస్తరించడానికి అలుపెరుగని కృషి చేశారని కొనియాడారు. “ఆయన జీవితం ఎల్లప్పుడూ బీజేపీ కార్యకర్తలందరికీ స్ఫూర్తిగా నిలిచింది, అలాగే నిలుస్తుంది” అని సచ్దేవా అన్నారు.
మల్హోత్రా ఐదు సార్లు ఎంపీగా, రెండు సార్లు ఢిల్లీ ఎమ్మెల్యేగా పని చేశారు. ఢిల్లీలో ఆయన బీజేపీ పార్టీ కృషి కోసం విపరీతంగా కృషి చేశారు. ఢిల్లీ తొలి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పని చేసిన ఈయన మృతితో అనేక మంది సంతాపం తెలియజేస్తున్నారు.
ముఖ్యంగా బీజేపీ అగ్రనేతల నుంచి కార్యకర్తల వరకూ అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ మల్హోత్రా ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
మల్హోత్రా చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. మల్హోత్రా దేశ రాజకీయాలకు.. ముఖ్యంగా ఢిల్లీలో బీజేపీ బలోపేతానికి చేసిన కృషి అపారమైనదని చెప్పుకొచ్చారు. ఆయన మరణం పార్టీకి ఒక తీరని లోటని నాయకులు పేర్కొన్నారు.
అలాగే విజయ్ కుమార్ మల్హోత్రా ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ సందేశాలు పంపారు. మరోవైపు పార్టీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఉదయం 8.45 గంటలకే ఆయన అధికారిక నివాసమైన 21 గురుద్వారా రాకబ్గంజ్ రోడ్కు తీసుకువచ్చారు.




