
కారేపల్లిలో మద్యం మాఫియా దందా!
కారేపల్లి మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ శాఖ దాడులు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి.
భాగ్యనగర్ తండా పరిధిలోని లావుడియా తండా గ్రామంలో సోమవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అధికారులు, బెల్ట్ షాపులో నిల్వ ఉంచిన మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి.
స్థానికంగా సుమారు రూ.20 వేల విలువైన మద్యం పట్టుబడినట్లు సమాచారం. అయితే ఎక్సైజ్ సీఐ ప్రశాంతి వివరణ కోరగా.. రెండు మద్యం సీసాలను మాత్రమే స్వాధీనం చేసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
అక్రమ మద్యం విక్రయాలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇదే బెల్టు షాపుపై గతంలోనే రెండు కేసులు నమోదై, తహసీల్దార్ ఎదుట లక్ష రూపాయల బైండ్ ఓవర్ కూడా చేసినట్లు స్పష్టం చేశారు.
కల్తీ మద్యం విక్రయాలపై ఎలాంటి సహనం ఉండదని సీఐ ప్రశాంతి హెచ్చరిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ దర్యాప్తు కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.



