
మాజీ సర్పంచ్ కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలో చేధించిన పోలీసులు
ముదిగొండ మండలం పండ్రేగుపల్లి మాజీ సర్పంచ్, ప్రస్తుత సర్పంచ్ భర్త పాలు శిల్వరాజును బుధవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆయనను వాహనంలో హైదరాబాద్కు తీసుకెళ్తున్నట్లు గుర్తించి గంటల వ్యవధిలోనే రక్షించి తీసుకొచ్చారు.
ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. బుధవారం వేకువజామున శిల్వరాజు సెల్ఫోన్ ఇంట్లోనే పెట్టి వాకింగ్కు వెళ్లాడు.
ఈ సమయాన బొలేరో వాహనంలో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై ముసుగు వేసి వాహనంలో తీసుకెళ్లారు. ఆ వాహనం హైదరాబాద్ వైపు వెళ్తుండగా గుర్తించిన రైతులు గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు.
ఫోన్ చేయడంతో… శిల్వరాజు కిడ్నాప్ అయినట్లు తెలియడంతో ఆయన భార్య, ప్రస్తుత సర్పంచ్ పాము స్వర్ణలత పోలీసుస్టేషన్కు వెళ్లింది. ఆ సమయాన శిల్వరాజు తన కుటుంబీకులతో మాట్లాడతానంటూ కిడ్నాపర్లలో ఒకరి సెల్ నుంచి ఫోన్ చేయగా పిల్లలు మాట్లాడారు.
ఆపై విషయాన్ని స్టేషన్లో ఉన్న స్వర్ణలతకు చెప్పడంతో నంబర్ తీసుకున్న సీఐ మురళి ఆదేశాల మేరకు ఎస్ఐ అశోక్, సిబ్బంది విచారణ మొదలుపెట్టారు.
సెల్నంబర్ లొకేషన్ ఆధారంగా విచారిస్తుండడంతో వాహనం హైదరాబాద్ వెళ్లినట్లు తేలింది. దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి శిల్వరాజును కిడ్నాపర్ల చెర నుంచి రక్షించి ఆరు గంటల్లోగా ముదిగొండకు తీసుకొచ్చారు.
అప్పటికే స్టేషన్ వద్ద స్థానికులు పెద్దసంఖ్యలో ఉండడంతో వారి సమక్షాన ఆయనను కుటుంబానికి అప్పగించడంతో అంతా ఊపిరి పీల్చుకోవడమే కాక గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులను అభినందించారు.
భూమి పంచాయితీ పెద్దగా… పంగ్రేడుపల్లిలో ఒక భూమికి సంబంధించి కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఈ విషయంలో రెండు కుటుంబాల నడుమ ఘర్షణ పెరగగా, ఇరువర్గాల పెద్దమనుషులు పంచాయితీ చేసిన పరిష్కారం కాలేదు. దీంతో రెండు కుటుంబాల నడుమ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న శిల్వరాజును ఒక వర్గం వారు లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలిసింది.
ఈక్రమంలోనే భూవివాదాన్ని పరిష్కరించాలంటూ కిడ్నాప్ చేసి దాడి చేసినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి విచారణ అనంతరం నిందితులపై కేసు నమోదు చేయనున్నట్లు సీఐ మురళి తెలిపారు.



