
ప్రజా స్వరాలపై కఠిన చట్టాల ప్రయోగం ఆందోళనకరం
- సీనియర్ జర్నలిస్ట్, ఫెడరేషన్ మాజీ జిల్లా అధ్యక్షుడు టి.ఎస్. చక్రవర్తి
ఖమ్మం, ఏప్రిల్ 9:
సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) ‘ ఉప చట్టం’ కింద కేసు నమోదు చేసి, నోటీసు జారీ చేయడాన్ని సీనియర్ జర్నలిస్ట్, ఫెడరేషన్ మాజీ జిల్లా అధ్యక్షుడు టి.ఎస్. చక్రవర్తి తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై మాట్లాడే స్వరాలను కఠిన చట్టాల కత్తితో భయపెట్టే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి శుభ సూచికలు కావని ఆయన స్పష్టం చేశారు.
పేదల పక్షాన నిలబడి, హక్కుల కోసం పోరాడే నాయకులు, ఉద్యమకారులపై కేసులు, నోటీసులు, ఒత్తిడులతో బలహీనుల చేసే ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో విభేద స్వరాలు, విమర్శలు, ప్రజా చర్చలు సహజమని, వాటిని అణచివేయాలనే వైఖరి ప్రజాస్వామ్య వ్యవస్థలపైనే అనుమానాలు పెంచుతుందని అన్నారు. ప్రశ్నించే గొంతుకలను లక్ష్యంగా చేసుకోవడం సమాజానికి మేలు చేయదని వ్యాఖ్యానించారు.
పోటు రంగారావు వంటి ప్రజా నాయకులపై నమోదైన కేసులను పునర్విమర్శించి, అవసరమైతే ఉపసంహరించుకోవాలని టి.ఎస్. చక్రవర్తి డిమాండ్ చేశారు.
ప్రజా ఉద్యమాలను అణచివేయడంపై దృష్టి పెట్టడం కంటే, ప్రజలు లేవనెత్తుతున్న అసలు సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వ యంత్రాంగం పని చేయాలని కోరారు. చట్టాలు ప్రజల రక్షణ కోసం ఉండాలి గానీ, ప్రజా స్వరాలను కట్టడి చేయడానికి ఆయుధాలుగా మారకూడదన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం నేరం కాదని, ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు, ఆవేదనలను వినిపించే వేదికలు బలపడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
రాజ్యాంగబద్ధ హక్కులు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ప్రజా చర్చలకు తగిన గౌరవం లభించినప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుందని, సమాజంలో శాంతి, న్యాయం, పరస్పర గౌరవం నిలవాలంటే వ్యవస్థలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని టి.ఎస్. చక్రవర్తి అన్నారు.



