
రైతులకు ఊరటనిచ్చిన గోదావరి జలాలు
సీతారామ లిఫ్ట్ కెనాల్ నుంచి సాగర్ కాలువలోకి గోదావరి ప్రవాహం
ప్రత్యేక పూజల అనంతరం నీటి విడుదలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే – రైతులకు ఊరటనిచ్చిన ప్రభుత్వం
CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జులై 10 2026: సీతారామ లిఫ్ట్ కెనాల్ ద్వారా గోదావరి జలాలను సాగర్ కాలువకు మళ్లించే కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం గోదావరి జలాల విడుదలకు శ్రీకారం చుట్టారు.
సాగునీటి కోసం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వ్యవసాయ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ గోదావరి జలాలను సీతారామ లిఫ్ట్ కెనాల్ ద్వారా సాగర్ కాలువకు మళ్లించేలా చర్యలు తీసుకోవడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం కృష్ణా జలాలు సాగర్ కాలువకు అందకపోవడంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరి నారు మళ్లు పోయడానికి, పంటల సాగుకు అవసరమైన నీటి కోసం బోరుబావులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. భూగర్భ జలాలు కూడా తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి జలాలను సాగర్ కాలువకు మళ్లించడం రైతులకు పెద్ద ఊరటనిచ్చే నిర్ణయంగా మారింది.
సీతారామ లిఫ్ట్ కెనాల్ ద్వారా వచ్చిన గోదావరి జలాలు సాగర్ కాలువలో ప్రవహించడం ప్రారంభించడంతో ఆయకట్టు ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటితో వరి నారు మళ్లు పోసుకోవడం, ఖరీఫ్ సాగు పనులను వేగవంతం చేయడం సాధ్యమవుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, సరైన సమయంలో సాగునీరు అందించడం వల్ల పంటల సాగు సాఫీగా సాగుతుందని, భూగర్భ జలాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలతో వ్యవసాయానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
నీటి విడుదల కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, రైతు నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే రైతులతో మాట్లాడి, సాగునీటి సరఫరా విషయంలో ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
గోదావరి జలాలను సాగర్ కాలువకు మళ్లించడం ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉండటంతో పాటు, ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.




