
ఒక్క కాల్తో రూ.5 వేల మాయం..
సైబర్ మోసగాళ్ల కొత్త ఎత్తుగడ
స్కాలర్షిప్ పేరుతో సైబర్ మోసం..
కూలీ మహిళ నుంచి రూ.5 వేల కాజేసిన కేటుగాళ్లు
పదో తరగతి విద్యార్థిని పేరుతో నమ్మించి ఫోన్పే చేయించిన మోసగాళ్లు..
అప్రమత్తంగా ఉండాలని సూచనలు
CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జులై 14 2026: ఏన్కూరు మండల పరిధిలోని బురద రాఘవాపురం గ్రామంలో స్కాలర్షిప్ పేరుతో సైబర్ మోసగాళ్లు ఓ నిరుపేద కుటుంబాన్ని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని సుంకర శ్రావణి తల్లి లక్ష్మికి ఫోన్ కాల్ వచ్చింది. అయితే ఆమె కూలీ పనిలో ఉండటంతో కాల్కు స్పందించలేకపోయారు.
అనంతరం అదే నంబర్ నుంచి లక్ష్మి మరిది శ్రీనివాస్కు ఫోన్ చేసి, “మీ వదిన కుమార్తెకు స్కాలర్షిప్ మంజూరైంది. డబ్బులు రావాలంటే ముందుగా ఇన్సూరెన్స్ చేయించాలి. అందుకు రూ.5,000 చెల్లించాలి” అని నమ్మించారు. శ్రీనివాస్ కాల్ కాన్ఫరెన్స్ ద్వారా లక్ష్మితో మాట్లాడించడంతో, నిజమేనని నమ్మిన ఆమె ఇంటికి వెళ్లి రూ.5 వేల నగదు తీసుకుంది.
తన వద్ద సాధారణ ఫోన్ ఉండటంతో సమీపంలోని దుకాణానికి వెళ్లి, మోసగాళ్లు సూచించిన నంబర్కు ఫోన్పే ద్వారా రూ.5,000 పంపించింది. అనంతరం అనుమానం వచ్చి మళ్లీ ఆ నంబర్కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో తాము మోసపోయినట్లు గ్రహించారు.
కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ కుటుంబం ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురైంది. స్కాలర్షిప్, ప్రభుత్వ పథకాలు, బహుమతులు పేరుతో డబ్బులు అడిగే వ్యక్తులను నమ్మవద్దని, ఎలాంటి చెల్లింపులు చేసే ముందు సంబంధిత పాఠశాల లేదా ప్రభుత్వ అధికారులను సంప్రదించి నిజానిజాలు నిర్ధారించుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు.




