
సర్పంచ్ భర్త పెత్తనంపై వార్డు సభ్యుల తిరుగుబాటు
Web desc : మహిళల రాజకీయ సాధికారత కోసం రాజ్యాంగం గ్రామపంచాయతీల్లో కల్పించిన రిజర్వేషన్లు అభాసు పాలవుతున్నాయి. గ్రామ పరిపాలనలో మహిళలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేలా చట్టాలు రూపొందించినా అధికారులు తూట్లు పొడిచారు. అందుకే ఆ లక్ష్యానికి విరుద్ధంగా కొన్నిచోట్ల మహిళా సర్పంచ్ స్థానంలో ఆమె భర్తలే అధికారం చెలాయిస్తున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి.
తాజాగా కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఓ తండా గ్రామ సర్పంచ్ భర్త జోక్యం అధికమైందని ఆరోపిస్తూ వార్డు సభ్యులు మండల, జిల్లా స్థాయి అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.
వార్డు సభ్యుల ఆరోపణలు… ఫిర్యాదు పత్రం ప్రకారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక ఛాంబర్ ను ఏర్పాటు చేసుకుని సర్పంచ్కు బదులుగా ఆమె భర్త కూర్చొని పరిపాలన నిర్వహిస్తున్నారు.
భర్తతో పాటు ఆమె ఇద్దరు కుమారులు కూడా అజమాయిషీ చేస్తున్నారు. గ్రామంలోని పనులు, నిర్ణయాలు, బిల్లులు, అధికారులతో సమావేశాలు అన్నీ ఆయనే చూసుకుంటున్నారు. గ్రామపంచాయతీ సమావేశాల్లో కూడా సర్పంచ్ భర్తే నిర్ణయాలు తీసుకుంటున్నారు.
తన సొంత నిధులతో తాగు నీటి కోసం బోరు వేయించినట్టు పత్రికా ప్రకటనలు ఇచ్చి ప్రస్తుతం పంచాయతీ నిధులు తీసుకోవడానికి ఎం బి చేయిస్తున్నారు. వార్డు సభ్యుల అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని, తమకు పరిపాలనా విషయాలేమీ తెలియడం లేదని ఫిర్యాదులో వివరించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.




