
మల్లారంలో యాప్ రాకను ఆసరాగా ‘ఆర్గానిక్ డీఏపీ’ అమ్మకాలు
అనుమతులు ఉన్నాయా.. నాణ్యతపై స్పష్టత ఏదీ?
తనిఖీలు చేపట్టాలని రైతుల డిమాండ్
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఆగస్టు 09 2026: ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లారం గ్రామంలో కొంతమంది వ్యక్తులు తిరుగుతూ ‘ఆర్గానిక్ డీఏపీ’ పేరుతో ఎరువులను విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఎరువుల విక్రయాలకు సంబంధించిన యాప్ అందుబాటులోకి రావడాన్ని ఆసరాగా చేసుకుని గ్రామాల్లో విక్రయాలు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ఎరువుల విక్రయాలకు సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సదరు ఉత్పత్తికి వ్యవసాయ శాఖ లేదా సంబంధిత శాఖల నుంచి అనుమతులు ఉన్నాయా? తయారీ సంస్థ ఏది? ఉత్పత్తి నాణ్యతకు సంబంధించిన ధ్రువపత్రాలు ఉన్నాయా? ప్యాకెట్పై బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, గడువు తేదీ, ధర తదితర వివరాలు సక్రమంగా ఉన్నాయా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
మరోవైపు, ఎరువుల పేరుతో గుర్తుతెలియని ఉత్పత్తులను విక్రయిస్తే రైతులు నష్టపోయే అవకాశం ఉందని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పంటల సాగు సమయంలో ఎరువుల నాణ్యత విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.
మల్లారం గ్రామంలో జరుగుతున్నట్లు చెబుతున్న ‘ఆర్గానిక్ డీఏపీ’ విక్రయాలపై వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, ఉత్పత్తి అనుమతులు, నాణ్యత, విక్రయదారుల వివరాలను పరిశీలించాలని రైతులు కోరుతున్నారు. అధికారుల తనిఖీల అనంతరం అసలు విషయం వెలుగులోకి వస్తుందని వారు ఆశిస్తున్నారు.




