
ప్రార్థనల ముసుగులో పాస్టర్ దారుణం.. నాలుగేళ్లుగా బాలికపై లైంగిక వేధింపులు?
web desc : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఓ చర్చి పాస్టర్పై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రార్థనల పేరుతో పరిచయం పెంచుకుని మైనర్ బాలికను గత నాలుగు సంవత్సరాలుగా లైంగికంగా వేధించడంతో పాటు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది.
అంతేకాకుండా తనను, కుటుంబ సభ్యులను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. బాధితురాలి కుటుంబ సభ్యులకు దేవుని వాక్యాలు చెబుతానంటూ పాస్టర్ వారి ఇంటికి వచ్చేవాడని, ఈ క్రమంలో బాధితురాలితో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి.
అనంతరం ఆమెతో నాలుగేళ్లుగా లివింగ్ రిలేషన్షిప్ కొనసాగిస్తూ లైంగికంగా వేధించాడని బాధితురాలు ఆరోపించినట్లు తెలుస్తోంది.తాను పెళ్లి చేసుకోవాలని పలుమార్లు కోరినా పాస్టర్ పట్టించుకోలేదని బాధితురాలు పేర్కొన్నట్లు సమాచారం. పైగా ఇతర మహిళలతో కలిసి దిగిన ఫొటోలను తనకు, కుటుంబ సభ్యులకు వాట్సాప్ ద్వారా పంపుతూ బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది.
తనతో కలిసి దిగిన వ్యక్తిగత ఫొటోలు, అభ్యంతరకరమైన ఫొటోలను బయటపెడతానంటూ బెదిరించాడని కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై పాస్టర్ కుటుంబ సభ్యుల నుంచి కూడా డబ్బులు తీసుకున్నాడని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పాస్టర్ను వివాహం చేసుకోవాలని తోటి పాస్టర్లు సూచించినప్పటికీ ఆయన పట్టించుకోలేదని సమాచారం.
ఈ ఘటనపై బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు కలిసి బుధవారం బయ్యారం పోలీస్ స్టేషన్లో పాస్టర్తో పాటు ఆయన తల్లిపై ఫిర్యాదు చేసింది. తనకు జరిగిన అన్యాయం మరే ఇతర అమ్మాయికి జరగకుండా పాస్టర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరినట్లు సమాచారం. ఈ విషయంపై బయ్యారం ఏఎస్ఐ స్వప్నను వివరణ కోరగా.. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, వారికి కౌన్సెలింగ్ నిర్వహించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది.




