
అప్పుల్లో రైతులు.. వర్షాల కోసం ఎదురుచూపులు
పంటలు ఎండిపోతున్నా పట్టించుకోరా..? కర్రెడ్ల నరేందర్ రెడ్డి
సి కే న్యూస్ షాద్ నగర్ :సెప్టెంబర్ 11
రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ సాంస్కృతిక శాఖ కో-కన్వీనర్ కర్రెడ్ల నరేందర్ రెడ్డి రైతుల పంట నష్టంపై ఆవేదన వ్యక్తం చేశారు.సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి సాగు చేసిన రైతులకు వర్షాభావ పరిస్థితులు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని తెలిపారు.
పంటలు దెబ్బతినడంతో పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేక రైతులు అయోమయంలో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు వారి జీవితాలను మెరుగుపరిచే విధంగా ఉండాలని, రైతులకు సాగు కోసం అవసరమైన సహకారం, ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజనను సమర్థవంతంగా అమలు చేసి ఉంటే పంట నష్ట సమయంలో రైతులకు ఆర్థిక భరోసా లభించేదని నరేందర్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల పరిస్థితిని గుర్తించి, పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునేలా తక్షణమే నష్టపరిహారం ప్రకటించి, ఆర్థికంగా అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు.




