*లంచం తీసుకుంటు పట్టుపడ్డ SI డ్రైవర్*

*లంచం తీసుకుంటు పట్టుపడ్డ SI డ్రైవర్*;

By :  Ck News Tv
Update: 2025-02-12 04:38 GMT

ఓ కేసులో రూ.50 వేల లంచం డిమాండు చేసి రూ.30 వేలు తన ప్రైవేట్‌ డ్రైవర్‌ ద్వారా తీసుకుంటున్న ధారూరు ఎస్‌ఐని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

నగదు స్వాధీనం చేసుకుని ఎస్‌ఐ, డ్రైవర్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా ధారూరు పోలీసుస్టేషన్‌లో మంగళవారం సాయంత్రం జరిగింది. ఏసీబీ అధికారులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మండల పరిధిలోని నాగసమందర్‌ గ్రామానికి చెందిన ఉప్పరి హన్మంతు, ఉప్పరి గోపాల్‌ దాయాదులు. ఇద్దరి భూ తగాదాల్లో హన్మంతు వర్గం గోపాల్‌ వర్గంపై దాడి చేసి గాయపర్చింది. ఈ వివాదంలో గోపాల్‌ వర్గానికి చెందిన ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. కాగా ఈ కేసులో ఒకరిని తప్పించడానికి, మిగతా ఆరుగురికి స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వటానికి రూ.70 వేల లంచం డిమాండు చేశాడు ధారూరు ఎస్‌ఐ వేణుగోపాల్‌ గౌడ్‌.

చివరకు రూ.50 వేలకు బేరం కుదుర్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా మంగళవారం రూ.30 వేలు ఇచ్చేందుకు గోపాల్‌ ఎస్‌ఐ వద్దకు రాగా డ్రైవర్‌ బీరప్పకు ఇవ్వాలని సూచించాడు. దీంతో డ్రైవర్‌ బీరప్పకు రూ.30 వేలు ఇవ్వగా అనంతరం ఆ డబ్బులను ఎస్‌ఐకి అందిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఎస్‌ఐ నుంచి రూ.30 వేలు స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేను నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. జనవరి 26న గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌, జిల్లా ఎస్పీ నుంచి ఎస్‌ఐ వేణుగోపాల్‌ గౌడ్‌ ఉత్తమ పోలీసు అఽధికారిగా అవార్డు అందుకున్నారు. అవార్డు అందుకున్న 15 రోజుల్లో ఏసీబీ అధికారులకు పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది.

Similar News