
జాగ కోసం జర్నలిస్టుల జంగ్
ఏన్కూరులో కదం తొక్కిన కలం
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఉద్యమబాట
సీకే న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఆగస్టు 25 2026: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ఏన్కూరు మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా మండల జర్నలిస్టులు పాదయాత్రకు ఘన స్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర ఉత్సాహభరితంగా కొనసాగింది.
తూతక్క లింగన్నపేట నుంచి పాదయాత్ర కొనసాగింది.మండలంలోని జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాదయాత్రలో పాల్గొని జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్కు మద్దతు తెలిపారు.
జర్నలిస్టులు ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వాలను కోరుతున్నప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్లకు, రాజకీయ పార్టీలకు అతీతంగా జర్నలిస్టులందరూ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.
పాదయాత్రలో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అవసరమైతే భవిష్యత్లో చేపట్టే ఆందోళనల్లోనూ పాల్గొంటామని తెలిపారు.
అనంతరం పాదయాత్ర ఏన్కూరు తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది. అక్కడ సంబంధిత తహసిల్దార్ సిహెచ్ శేషగిరిరావుకు వినతిపత్రం సమర్పించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించేలా ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని కోరారు. కేవలం ప్రభుత్వ పరమైన ప్రక్రియకే పరిమితం కాకుండా ప్రత్యేక చొరవతో సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం కోసం అవసరమైతే జైలు భరో కార్యక్రమానికైనా సిద్ధంగా ఉన్నామని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. ఈ పాదయాత్ర ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా కాదని, జర్నలిస్టుల సమస్యను పాలకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించేందుకు చేపట్టిన ప్రజాస్వామ్య పోరాటమని తెలిపారు.
ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టులు పోరాటాలు చేస్తున్నారని, ఇకపై సమస్య పరిష్కారం అయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జర్నలిస్టుల ఐక్యతను చాటుతూ సాగిన పాదయాత్రకు మండలంలో మంచి స్పందన లభించింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొని సంఘీభావం తెలిపారు.




