
గొడవను సర్దిచెప్పేందుకు వెళ్లిన సర్పంచ్పై హత్యా*యత్నం..
web desc : హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి-ఇందిరానగర్ గ్రామ సర్పంచ్ కొడిగూటి ప్రవీణ్పై అదే గ్రామానికి చెందిన దుబాసి రాజు అనే వ్యక్తి బటన్ చాకుతో హత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై బాధితుడు హుజూరాబాద్ సీఐ టి. కరుణాకర్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. గురువారం రాత్రి ఇందిరానగర్ గ్రామంలో యువకుల మధ్య ఘర్షణ జరుగుతోందని, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారని సర్పంచ్ ప్రవీణ్కు ఫోన్ ద్వారా సమాచారం అందింది.
దీంతో గ్రామ ప్రథమ పౌరుడిగా గొడవను సర్దిచెప్పేందుకు ఆయన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఇరువర్గాలకు సర్దిచెప్పి గొడవను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తుండగా, ఘర్షణతో ఎలాంటి సంబంధం లేని దుబాసి రాజు తన అనుచరులతో కలిసి అక్కడికి వచ్చినట్లు సర్పంచ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
గత కొంతకాలంగా తనపై కక్ష పెంచుకున్న దుబాసి రాజు అకస్మాత్తుగా తన వద్ద ఉన్న బటన్ చాకును తీసి తన గొంతు, పొట్ట, మెడ భాగాలపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించాడని తెలిపారు. ఈ దాడిలో తన పొట్ట, మెడకు గాయాలయ్యాయని, అప్రమత్తంగా వ్యవహరించడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని పేర్కొన్నారు.
ఘటన సమయంలో అక్కడ ఉన్న గ్రామస్తులు దుబాసి రాజును నిలదీయగా, సర్పంచ్ను ఎప్పటికైనా చంపి తీరుతానంటూ బహిరంగంగా హెచ్చరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనపై హత్యాయత్నానికి పాల్పడిన దుబాసి రాజుపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు తనకు రక్షణ కల్పించాలని సర్పంచ్ ప్రవీణ్ పోలీసులను కోరారు.




