
వైద్యుల వేధింపులు తట్టుకోలేక ఏఎన్ఎం ఆత్మహత్యాయత్నం
వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల పెత్తనం కొనసాగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా వైద్యుల వేధింపులు తట్టుకోలేక ఒక మహిళా ఏఎన్ఎం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.
స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సౌజన్య, శిరీష అనే వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. అదే ఆసుపత్రిలో సెకండ్ ఏఎన్ఎంగా పనిచేస్తున్న రజినిని మధ్యాహ్న సమయంలో యూడీసీ శ్రీలత మాసాయిపేట బీసబ్ సెంటర్లో సిబ్బంది లేరని తక్షణమే అక్కడికి వెళ్లాలని ఆదేశించారు.
విధుల్లో ఇలాంటి ఒత్తిడి, వేధింపులు ఎదురవుతున్నాయనే మనస్తాపంతో రజిని ఆసుపత్రిలోని ఓ గదిలో మెట్ఫార్మిన్ 500 ఎంజి నాలుగు మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనను గమనించిన సిబ్బంది వెంటనే రజినికి ప్రాథమిక చికిత్స అందించారు.
ఈ సందర్భంగా రజిని మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా ఇద్దరు మహిళా వైద్యులు తన విధి నిర్వహణలో ఇబ్బందులు కలిగిస్తున్నారని, తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని కన్నీటి పర్యంతమయ్యారు.
చిన్న ఉద్యోగం ఆధారంగా జీవిస్తున్న తాను వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా డాక్టర్లు సిబ్బందిపై అనవసర ఒత్తిడి, వేధింపులు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇదే కారణంగా గతంలో ఒక ఏఎన్ఎం ఉద్యోగం వదిలేసినట్లు సమాచారం. ప్రస్తుత సిబ్బంది కూడా ఇబ్బందులు బయటపెట్టకుండా సెలవులు తీసుకోవడం లేదా బదిలీలు కోరుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
ఈ ఘటనపై జిల్లా వైద్య శాఖ అధికారులు సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఏఎన్ఎం రజినిని మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్ ద్వారా మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.




