
తహశీల్దార్ కార్యాలయంలో ఎసిబి సోదాలు
వరంగల్ జిల్లా దుగ్గొండి తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.
వారసత్వ భూమికి సంబంధిత ఫైల్ పరిష్కారం కోసం రూ. 10 వేలు లంచం తీసుకుంటున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ గొట్టెముక్కల రాంబాబును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మధిర గ్రామానికి చెందిన లొల్లాటి రాజు తన తండ్రి నర్సయ్య పేరు మీద ఉన్న 27 గుంటల వ్యవసాయ భూమి పట్టా చేసుకునేందుకు వారసత్వ భూమి నమోదు ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకోగా, సంబంధిత ఫైల్ను ముందుకు జరిపేందుకు ఆర్ఐ రాంబాబు రూ. 10 వేల లంచం డిమాండ్ చేశాడు.
బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు పక్కా ప్రణాళికతో దాడి నిర్వహించినట్లు వెల్లడించారు. తహశీల్దార్ కార్యాలయంలోనే లంచం తీసుకుంటున్న సమయంలో అధికారులు ఆర్ఐని అదుపులోకి తీసుకొని, నగదును స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించి, సంబంధిత పత్రాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనతో తహశీల్దార్ కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




