
దొంగ ఏడుపులు, మొసలి కన్నీరు ఆపి దమ్ముంటే వాళ్ళను పరామర్శించు: హరీష్ రావుకు కౌంటర్
బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం వికటించి, నిమ్స్ లో చేరి చికిత్స పొందుతున్న బాలింతలను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
ఇందిరమ్మ రాజ్యంలో మహిళల ప్రాణాలకు రక్షణ లేదన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ హరీష్ రావు పై రివర్స్ ఎటాక్ చేశారు.
దొంగ ఏడుపులు ఏడుస్తూ రాజకీయాలు చేస్తారా?.. ఇబ్రహీంపట్నం సీహెచ్సీలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణించిన ఘటన మరిచిపోయారా హరీశ్ రావు గారు? అంటూ ప్రశ్నించి నాడు ఆరోగ్యశాఖ మంత్రిగా ఉండి.. నలుగురు బాలింతలు చనిపోయినా చప్పుడు చేయలేదు మీరు అన్నారు. ఈరోజు దొంగ ఏడుపులు ఏడుస్తూ.. రాజకీయాలు చేస్తుంటే నమ్మడానికి తెలంగాణ ప్రజలు అమాయకులేమీ కాదని మండిపడ్డారు. మీ గోబెల్స్ ప్రచారాలు, మొసలి కన్నీరు ఇకపై చెల్లవన్నారు.
ఏకంగా 15 వేల పోస్టులను ఈ రెండున్నర సంవత్సరాల్లో భర్తీ.. మీ పాలనలో పడకేసిన ప్రభుత్వ హాస్పిటళ్లను, మా ప్రభుత్వంలో బాగు చేస్తున్నాం అన్నారు. ఒక్కటో రెండో కాదు.. ఏకంగా 15 వేల పోస్టులను ఈ రెండున్నర సంవత్సరాల్లో భర్తీ చేశామని పేర్కొన్నారు. పేపర్ల మీద జీవోలు ఇచ్చి.. గోదాముల్లో, పాడుబడిన భవనాల్లో మీరు ఓట్ల కోసం ప్రారంభించిన మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటళ్లను అద్భుతమైన అధునాతన వసతులతో కూడిన భవనాల్లోకి మారుస్తున్నాం చూడాలన్నారు.
మీలా మసిపూసి, మాటలగారడీ చేసే రకాలం కాదు మేము…ఒక్కో విభాగాన్ని ఆధునీకరిస్తూ.. ప్రభుత్వ హాస్పిటళ్లపై ప్రజలకు మా మంత్రి దామోదర్ రాజనర్సింహ నమ్మకాన్ని పెంచుతున్నారన్నారు.ఫలితంగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ప్రైవేటు హాస్పిటళ్లకు వెళ్లే పేషెంట్ల సంఖ్య తగ్గుతోందని పేర్కొన్నారు. మీలా మసిపూసి, మాటలగారడీ చేసి చేతులు దులుపుకునే రకం కాదు మేము అంటూ ఆయన హితవు పలికారు.
బాన్సువాడ ఘటనపై కమిటీ వేసిన మంత్రి, చర్యలకు ఉపక్రమణ.. పబ్లిసిటీ కోసం పాకులాట, పదవుల కోసం ఆరాటం మా ప్రభుత్వానికి లేదన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏది చేయాలో, అది చేస్తూ వెళ్తున్నాం అన్నారు.బాన్సువాడ ఘటన మా మంత్రి గారి దృష్టికి వచ్చిన వెంటనే.. 13వ తేదీ నాడే ఎంక్వైరీ కమిటీ వేశారని గుర్తు చేశారు. సీనియర్ వైద్యులను కమిటీలో మెంబర్లుగా నియమించారు. కమిటీ రిపోర్ట్ ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
దమ్ముంటే వెళ్లి వారిని పరామర్శించండి : హరీష్ రావుకు అద్దంకి దయాకర్ సవాల్
డెలివరీ తర్వాత అస్వస్థతకు గురైన బాలింతలను నిమ్స్కు తరలించి పూర్తి బాధ్యత తీసుకున్నాం అని చెప్పారు.ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందించాం. హాస్పిటల్లో ఉన్న ఐదుగురిని ఆరోగ్యంగా ఇండ్లకు పంపిస్తాం అని చెప్పారు. మీ పాలనలో ఇబ్రహీంపట్నం ఘటనలో చనిపోయిన బాలింతల కుటుంబాలు, వారి పిల్లలు నేటికీ ఎంతో ఆవేదన చెందుతున్నారు.మొసలి కన్నీరు కార్చడం మాని, దమ్ముంటే వెళ్లి వారిని పరామర్శించండి అంటూ సవాల్ విసిరారు.




