
ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్..
ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో కలుషితాహారం ఘటనలో మంగళవారం ఒక రోగి మృతి చెందడంతో పాటు 70 మంది అస్వస్థతకు గురయ్యారు.
బుధవారం కూడా పలువురు రోగులు డయేరియా లక్షణాలతో బాధపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులకు సోమవారం మామూలు ఆహారం అన్నం, అరటి పండ్లు, గుడ్లతో పాటు పరమాన్నాన్ని కూడా వడ్డించారు.
సాయంత్రానికి డీసీ, కోర్టు వార్డుల్లోని కొంత మందికి స్వల్ప వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. వైద్యులు చికిత్సనందించినా కూడా డీసీ వార్డులో చికిత్స పొందుతున్న వ్యక్తి(30) తీవ్ర అస్వస్థతకు గురై మంగళవారం ఉదయం చనిపోయాడు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు.
అస్వస్థతకు గురైన 70 మంది రోగులల్లో ఇద్దరు తీవ్రమైన అస్వస్థతకు గురికావడంతో వెంటనే వారిని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
మిగతా 68 రోగులకు ఉస్మానియా వైద్యులు ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలోనే చికిత్సనందిస్తుండటం గమనార్హం. మరోవైపు ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
రోగుల మల నమూనాలను ఉస్మానియా దవాఖాన మైక్రో బయాలజీ విభాగానికి, నీటి నమూనాలను నారాయణ గూడ లోని ఐపీఎం నకు పంపించారు. హైదరాబాద్ కలెక్టర్ అనురాగ్ దుర్సెట్టి ఆసుపత్రికి చేరుకొని రోగుల పరిస్థతిపై ఆరా తీశారు.
జరిగిన సంఘటన గురించి డాక్టర్ అనిత వివరణ కోరగా.. 70 మంది అస్వస్థతకు గురైన మాట వాస్తవమని. ఐపీఎం, ఉస్మానియా ల నుంచి రిపోర్టులు వచ్చిన తర్వాత అసలు విషయం తెలుస్తుందని ఆమె పేర్కొన్నారు.
డైటీషియన్ పర్యవేక్షణ ఉందా..?
ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలలో మానసిక రోగులకు అందించే ఆహార నాణ్యత పట్టించుకునే నాథుడే లేడు. చాలా కాలంగా ఖాళీగా ఉన్న రెగ్యులర్ డైటీషియన్ ఫోస్ట్ ను భర్తీ చేయకుండా వదిలేశారు.
ఆసుపత్రిలోని సిబ్బందే డైటీషియన్ బాధ్యత తీసుకోవడంతో పర్యవేక్షణ అంతంత మాత్రంగానే సాగుతుంది. ఎన్నడూ లేనంతగా 70 మంది అస్వస్థతకు గురికావడంతో అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.