ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో.. వరంగల్ డీటీసీ అరెస్టు
వరంగల్, జగిత్యాల, హైదరాబాద్లలో ఏకకాలంలో ఏసీబీ సోదాలు;
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో.. వరంగల్ డీటీసీ అరెస్టు
ఉమ్మడి వరంగల్ జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్ ఇళ్లల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించి ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని గుర్తించి అరెస్టు చేశారు.
వరంగల్, జగిత్యాల, హైదరాబాద్లలో ఏకకాలంలో ఏసీబీ సోదాలు
ఉమ్మడి వరంగల్ జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్ ఇళ్లల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించి ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని గుర్తించి అరెస్టు చేశారు. హనుమకొండ పలివేల్పుల రహదారిలోని దుర్గా కాలనీలో ఉంటున్న శ్రీనివాస్ ఇంటికి ఉదయం 9 గంటలకు చేరుకున్న అనిశా అధికారులు ఆదాయ పత్రాలు, దస్తావేజులు, స్థిర, చరాస్తులకు సంబంధించి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ స్వస్థలమైన జగిత్యాలతో పాటు హైదరాబాద్లోని ఆయన నివాసంలోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సుమారు 10 గంటలపాటు ఆయన్ను విచారించారు. ఇంట్లోని పలు దస్తావేజులు పరిశీలించిన అనంతరం హసన్పర్తి మండలం చింతగట్టు క్యాంపులోని జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి తీసుకుని వచ్చి పలు అంశాలపై సమాచారాన్ని సేకరించారు. అనంతరం తిరిగి ఆయన్ను ఇంటికి తీసుకెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగాయి.
*రూ.4.04 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు*
అనిశా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రూ.4.04 కోట్ల అక్రమాస్తులు గుర్తించారు. ఇందులో ఐదు వేర్వేరు ప్రాంతాల్లో 15 ఎకరాల వ్యవసాయ భూమితోపాటు 16 ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి పుప్పాల శ్రీనివాస్ను అరెస్టు చేశారు. గతేడాది ఫిబ్రవరిలో ఉమ్మడి వరంగల్ డీటీసీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన అంతకుముందు హైదరాబాద్ రవాణాశాఖ కార్యాలయంలోపనిచేశారు.