
కలెక్టర్ కు అడ్డంగా దొరికిపోయిన రెవెన్యూ సిబ్బంది..
సోషల్ మీడియాలో వైరల్ : తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తహసీల్దార్తో పాటూ రెవెన్యూ సిబ్బంది ఊహించిన షాకిచ్చారు. ఓ విశ్రాంత సైనికుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కలెక్టర్.. ఆ బాధితుడితో అధికారులకు ఫోన్ చేయించి అడ్డంగా బుక్ చేశారు. విశ్వేశ్వరరావు సైనికుడిగా పనిచేశారు.. పదవీ విరమణ తర్వాత పుల్లంపేట ప్రాంతంలో ప్రభుత్వం 5.44 ఎకరాల భూమి కేటాయించింది.
అయితే గత 20 ఏళ్లుగా ఈ భూమిని కొందరు ఆక్రమించుకున్నారు.. బాధితుడు తహసీల్దారు చుట్టూ తిరిగి, తిరిగి విసుగొచ్చింది. ఎన్నిసార్లు వెళ్లి మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో విశ్వేశ్వరావు కలెక్టర్ వెంకటేశ్వర్ను కలిశారు.
పుల్లంపేట తహసీల్దారు పుల్లారెడ్డి, వీఆర్వో బొమ్మి శ్రీనివాసులు తన సమస్యను పరిష్కరించడం లేదని కలెక్టర్ దగ్గర తన గోడు వెళ్లబోసుకున్నారు విశ్వేశ్వరరావు. వెంటనే స్పందించిన కలెక్టర్.. తన ఎదురుగానే తహసీల్దారుకు ఫోన్ చేయాలని సూచించారు. ఆయన వెంటనే ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని మరోసారి కోరారు. తహసీల్దారు మరోసారి నిర్లక్ష్యంగానే సమాధానం చెప్పారు.
ఆ భూమికి పట్టా ఉన్న సంగతి నిజమే.. కానీ ఆ భూమి మీ ఆధీనంలో లేదు కాబట్టి సర్వే చేయడం కుదరదని తహసీల్దారు అన్నారు. వెంటనే కలెక్టర్ వెంకటేశ్వర్ జోక్యం చేసుకున్నారు. ‘విశ్వేశ్వరరావుకు గతంలో ఇచ్చిన పట్టాను రద్దు చేసి మరో ఇవ్వడమో.. ప్రస్తుతం ఇచ్చిన భూమిలో ఆక్రమణలు తొలగించడమో చేయాలి..
పైగా ఆ భూమిని కబ్జా చేసినవారికి మద్దతు తెలుపుతావా’ అంటూ కలెక్టర్ తహసీల్దారుపై మండిపడ్డారు. విశ్వేశ్వరరావుకు చెందిన భూమి విషయంలో త్వరగా చర్యలు తీసుకోవాలని.. భూమిని కబ్జా చేసిన వాళ్లపై కేసు నమోదు చేయాలని తహసీల్దారును ఆదేశించారు కలెక్టర్ వెంకటేశ్వర్.
ఈ పని త్వరగా పూర్తిచేయకపోతే.. ఇద్దర్ని సస్పెండ్ చేస్తానని తహసీల్దారు, వీఆర్వోను హెచ్చరించారు. అలాగే రేణిగుంట విమానాశ్రయానికి దగ్గరలో ప్రభుత్వ భూమి ఉంది.
అయితే ఆ భూమిలో ఒకరు ప్లాట్లు వేస్తున్నారు.. స్థానికుడు ఒకరు స్పందించి వీఆర్వోకు ఫిర్యాదు చేశారు. అయితే రివర్స్లో వీఆర్వో నీకేం సంబంధమంటూ స్థానికుడ్ని ప్రశ్నించారు. దీంతో ఆ వ్యక్తి కూడా కలెక్టర్ను కలిసి వీఆర్వోపై ఫిర్యాదు చేశారు.
కలెక్టరేట్ నుంచి మరోసారి వీఆర్వోకు సదరు వ్యక్తి ఫోన్ చేశారు.. ఆయన మళ్లీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో కలెక్టర్ ఫోన్ తీసుకుని మాట్లాడారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు..
వెంటనే ప్లాట్లు వేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. కలెక్టర్ నేరుగా బాధితులతో ఫోన్లు చేయించి అధికారులకు షాకిచ్చారు.. సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ఈ ఊహించని పరిణామంతో అధికారులు అవాక్కయ్యారు.




