
అదుపు తప్పి ట్రాలీ ఆటో బోల్తా….
రఘునాథపాలెం మండలం బూడిదంపాడుకు చెందిన ఉపాధి కూలీలు ప్రయాణిస్తున్న ట్రాలీ ఆటో అదుపుతప్పి కందకంలో పడగా ఏడుగురికి గాయాలయ్యాయి. సోమవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి.
బూడిదంపాడు నుంచి సూర్యతండా రోడ్డులో వరద మళ్లింపు కాల్వ పనులకు కూలీలు బయలుదేరారు.
ఖమ్మం నుంచి పుఠానీతండా వైపు వెళ్తున్న ఖాళీ ట్రాలీ ఆటోలో వెళ్తుండగా, మార్గమధ్యలోని మూలమలుపు వద్ద డ్రైవర్ అదుపు కోల్పోవడంతో వాహనం కందకంలో పడి చెట్టును ఢీకొట్టింది.
ఘటనలో చప్పిడి రాధ, చప్పిడి పాపమ్మ, కోపల స్వరూప, కలక మణి, చప్పిడి రజిని, గుడిబండ్ల పుష్పలీలతో పాటు ఆనందరావు గాయపడ్డారు. వీరిలో రాధ పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఏపీడీ శ్రీదేవి, ఏపీఓ పద్మనాయుడు, ఈసీ దీపక్ ఆస్పత్రికి చేరుకుని వివరాలు ఆరా తీశారు.
కాగా, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న రాధ చికిత్స ఖర్చులు రూ.2 లక్షలకు పైగా అయ్యే అవకాశం ఉండడంతో బూడిదంపాడుకు చెందిన ‘హెల్పింగ్ హ్యాండ్స్’ గ్రూప్ సభ్యులు నిధుల సేకరణ ప్రారంభించారు. ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు.




