
ఎమ్మెల్యే రాక కోసం నిరీక్షణ
రైతు వేదికలో గంటల తరబడి లబ్ధిదారుల వేచి చూపులు
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఆగస్టు 04 2026: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ పథకాల కింద మంజూరైన చెక్కుల పంపిణీ కార్యక్రమం కోసం ఏన్కూరు మండల పరిధిలోని స్థానిక రైతు వేదిక వద్ద మంగళవారం లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేస్తారని ముందుగానే సమాచారం అందడంతో మండలంలోని వివిధ గ్రామాల నుంచి మహిళలు, వృద్ధులు, కుటుంబ సభ్యులతో కలిసి మధ్యాహ్నం నుంచే రైతు వేదికకు చేరుకున్నారు.
అయితే ఎమ్మెల్యే రాక ఆలస్యం కావడంతో లబ్ధిదారులు గంటల తరబడి రైతు వేదిక వద్ద వేచి ఉండాల్సి వచ్చింది. మధ్యాహ్నం మూడు గంటలకు ఎమ్మెల్యే వస్తారని అధికారులు లబ్ధిదారులకు తెలియజేయడంతో అంతవరకు అక్కడే నిరీక్షించారు. చెక్కులు తీసుకోవాలనే ఆశతో తమ రోజువారీ పనులు, వ్యవసాయ పనులు, కూలి పనులు, కుటుంబ బాధ్యతలను సైతం పక్కనపెట్టి వచ్చిన వారు, కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురుచూస్తూ కనిపించారు.
చాలా మంది మహిళలు చిన్నపిల్లలతో పాటు రావడం, వృద్ధులు కూడా ఎక్కువసేపు కూర్చొని వేచి ఉండడం అక్కడ కనిపించిన దృశ్యంగా నిలిచింది. ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సహాయం తమ కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని, కార్యక్రమాన్ని మరింత ఆలస్యం చేయకుండా చెక్కులను త్వరగా పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరారు.
రైతు వేదిక వద్ద సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ లబ్ధిదారులను వరుసలో నిలబెట్టి సమన్వయం చేస్తూ కనిపించారు. ఎమ్మెల్యే రాక అనంతరం చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుందని అధికారులు లబ్ధిదారులకు తెలిపారు.




